అవన్నీ చెత్త మాటలు: 'దుబాయ్ పిచ్ అడ్వాంటేజ్' విమర్శలపై గంగూలీ కౌంటర్

  • భారత జట్టు విజయాలను తక్కువ చేసి చూపించే వారికి గంగూలీ గట్టి సమాధానం
  • టీమిండియా పాకిస్థాన్ పిచ్‌లపై ఆడి ఉండే భారీ స్కోర్లు చేసి ఉండేదని వెల్లడి
  • ప్రత్యర్థి ఎవరైనా ఓడించగల సత్తా టీమిండియాకు ఉందని స్పష్టీకరణ
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా దుబాయ్ వేదికగా మ్యాచ్‌లు ఆడుతోంది. దీంతో టీమిండియా ప్రదర్శనను కొందరు మాజీ ఆటగాళ్లు తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. భారత జట్టు విజయాలను తక్కువ చేసి చూపిస్తున్న వారికి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ గట్టి కౌంటర్ ఇచ్చారు.

దుబాయ్ కంటే పాకిస్థాన్ పిచ్‌లు చాలా నయమని, టీమిండియా కనుక దుబాయ్‌లో కాకుండా పాకిస్థాన్ పిచ్‌లపై ఆడి ఉంటే ఇంకా భారీ స్కోర్లు చేసి ఉండేదని గంగూలీ అన్నారు. టీమిండియాకు దుబాయ్ పిచ్‌లు అనుకూలమనే వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. కొంతమంది చేస్తున్న వ్యాఖ్యల్లో పస లేదని, అవన్నీ చెత్త మాటలే అన్నారు. అలా ఎందుకు మాట్లాడతారో అర్థం కావడం లేదని విమర్శించారు.

భారత జట్టు గత టీ20 ప్రపంచ కప్‌ను నెగ్గిందని, వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుందని తెలిపారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్ బలమైన జట్టు అని పేర్కొన్నారు. ప్రత్యర్థి ఎవరైనా ఓడించగల సత్తా భారత జట్టుకు ఉందని గంగూలీ వెల్లడించారు.

జస్‌ప్రీత్ బుమ్రా లేనప్పటికీ షమీ రూపంలో మంచి పేసర్ ఉన్నాడని తెలిపారు. క్రికెట్‌లో గాయాలు సహజమేనని, ముఖ్యంగా పేసర్లకు గాయాల బెడద ఎక్కువే అన్నారు. బుమ్రాతో కలిసి షమీ ఎన్నో మ్యాచ్‌‌లను గెలిపించాడని సౌరవ్ గంగూలీ తెలిపారు.

Sourav Ganguly
Team India
Cricket
Champions Trophy 2025

More Telugu News